న్యూఢిల్లీ : జాతీయ నగదీకరణ ప్రణాళిక (ఎన్ఎంపీ)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టిందని చేసిన వ్యాఖ్యలపై ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. నగదీకరణ అంటే రాహుల్కు అసలు అవగాహన ఉందా అని ఆమె ప్రశ్నించారు. దేశ వనరులను అయినకాడికి అమ్మేసి అందులో ముడుపులు తీసుకున్న చరిత్ర కాంగ్రెస్దని ఆరోపించారు.
ఇక కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నగదీకరణ ప్రణాళికపై రాహుల్ గాంధీ మంగళవారం విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దేశ సంపదను మోదీ సర్కార్ కొద్దిమంది బడా సంపన్నులకు దోచిపెడుతున్నారని, కార్పొరేట్ స్నేహితులకు లబ్ధి చేకూర్చేందుకే మోదీ ప్రభుత్వం ఎన్ఎంపీని ముందుకుతెచ్చిందని అన్నారు. ముందుగా దేశ గౌరవాన్ని అమ్మేసిన ప్రభుత్వం ఇప్పుడు భారత్ను అమ్మకానికి పెట్టిందని రాహుల్ తాజా ట్వీట్లో కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.