Nirmala Sitharaman | యూపీలో జరుగుతున్న ఐటీ దాడులపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఐటీ దాడులతో సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వణికిపోతున్నారని విమర్శించారు. ఐటీ దాడులను చూస్తే ఆయనకు భయం పుట్టుకొస్తుందా? లేదా వారితో ఏమైనా సంబంధాలున్నాయా? అంటూ నిర్మలా సీతారామన్ సూటిగా ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థల వద్ద పక్కా సమాచారం ఉంటేనే వారు సోదాలు నిర్వహిస్తారని, పక్కా సమాచారం తెలుసుకొనే, ఆ విభాగపు అధికారులు సోదాలు నిర్వహించారని ఆమె స్పష్టం చేశారు.
ఐటీ, జీఎస్టీ అధికారులకు కట్టలు కట్టలుగా సొమ్ము దొరికిందని, వారేమీ ఖాళీ చేతులతో తిరిగి రాలేదని, అంత సొమ్ము దొరికినా… కొందరు కేంద్రంపై అర్థంపర్థం లేని విమర్శలకు దిగుతున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. తప్పుడు సమాచారంతో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని అఖిలేశ్ చేసిన ఆరోపణలను ఆమె తప్పుబట్టారు. అధికారులు సరైన ఇంట్లోనే సోదాలు చేశారని, అందుకు తగిన ఆధారాలను కూడ బట్టబయలు చేశారన్నారు. ‘అవి బీజేపీ డబ్బులు కాదు. ఆ సోదాలను చూసి అఖిలేశ్ భయపడుతున్నారు. అవి ఎవరి డబ్బులో మీకెలా తెలుస్తుంది? మీరేమైనా వ్యాపార భాగస్వాములా? అవి ఎవరి డబ్బులనేవి కేవలం వ్యాపార భాగస్వాములకు మాత్రమే తెలుస్తాయి’ అంటూ నిర్మలా సీతారామన్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
యూపీలో వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం పెర్ఫ్యూమ్ వ్యాపారి పీయూశ్ జైన్ ఇంట్లో ఐటీ, జీఎస్టీ అధికారుల బృందం దాడులు చేసింది. 120 గంటల పాటు దాడులు చేసి, 257 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన్ను అరెస్ట్ కూడా చేశారు. ఇది మరిచిపోక ముందే మరో పెర్ఫ్యూమ్ వ్యాపారి, సమాజ్వాదీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.