ముంబై: మహారాష్ట్రలోని చంద్రాపూర్ (Chandrapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవదహనమయ్యారు. గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో చంద్రాపూర్-ముల్ రోడ్డుపై అజయ్పూర్ సమీపంలో డీజిల్ ట్యాంకర్, మొద్దుల లోడుతో వెళ్తున్న ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో లారీ డ్రైవర్తోపాటు కూలీలు ఉన్నారని చంద్రాపూర్ ఎస్డీపీవో సుధీర్ నందన్వార్ చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కాగా, ప్రమాదం జరిగిన గంట తర్వాత అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారని సమాచారం. కొన్ని గంటలపాటు శ్రమించిన తర్వాత మంటలను అదుపుచేసినట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాలను చంద్రాపూర్ జిల్లా దవాఖానకు తరలించామని తెలిపారు.