చెన్నై: కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. జనవరి 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ లాక్డౌన్ కొనసాగుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 5 గంటల వరకు నైట్ లాక్డౌన్ అమల్లో ఉంటుందన్నారు. ఆదివారాల్లో సంపూర్ణ లాక్డౌన్ను అమలు చేయనున్నట్లు తెలిపారు. అయితే, రెస్టారెంట్లలో పార్సిల్ కౌంటర్లకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తున్నట్లు చెప్పారు.
1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ఆన్లైన్లో తరగతులు బోధించాలని విద్యాశాఖ అధికారులకు సీఎం స్టాలిన్ సూచించారు. 10వ, 12వ తరగతి విద్యార్థులకు మాత్రం ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించాలని పేర్కొన్నారు. పొంగల్ సందర్భంగా ఎలాంటి వేడుకలకు, జనం గుమిగూడటానికి అనుమతించబోమని స్పష్టంచేశారు. ప్రజారవాణా సాధనాలైన బస్సులు, సబర్బన్ రైళ్లు, మెట్రో రైళ్లను 50 శాతం కెపాసిటీతో నడుస్తాయన్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో అన్ని మతాల ప్రార్థనాలయాల్లో భక్తులకు అనుమతి లేదని చెప్పారు.