లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మరికొన్ని ఆంక్షలపై ఆదేశాలు జారీ చేసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ నెల 30 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు వందకుపైగా కరోనా కరోనా కేసుల నమోదు, 500కుపైగా యాక్టివ్ కేసులు ఉన్న జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధించాలని పేర్కొన్నారు.
అలాగే 1 నుంచి 12 తరగతుల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కోచింగ్ సెంటర్లను ఈ నెలాఖరు వరకు మూసి వేయాలని యూపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ముందుగా నిర్ణయించిన పరీక్షలు జరుగుతాయని, దీని కోసం ఉపాధ్యాయులు, సిబ్బంది సిద్ధం కావాలని పేర్కొంది.
ఉత్తరప్రదేశ్లో శనివారం రికార్డుస్థాయిలో కొత్తగా 12,787 కరోనా కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఆరు లక్షలు, మరణాల సంఖ్య 9 వేలు దాటింది.