న్యూఢిల్లీ : భారతీయ యువతులను పెండ్లి ముగ్గులోకి దించి వారి కుటుంబ సభ్యులను సంస్థలో చేర్చుకునేందుకు ఉగ్ర సంస్ధ జమతుల్ ముజహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) భారీ స్కెచ్ వేసినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. 2014లో బుర్ధ్వాన్ బాంబు పేలుళ్ల అనంతరం భారత్లో నూతన సభ్యుల నియామకం కోసం జేఎంబీ కేడర్ వినూత్న పద్ధతికి తెరలేపిందని వెల్లడైంది. జేఎంబీ శ్రేణులు భారత మహిళలను పెండ్లి చేసుకుని ఆపై వారి కుటుంబ సభ్యులను ఉగ్ర సంస్ధల్లోకి చొప్పించే కార్యాచరణ అమల్లో పెట్టారని ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడింది.
2014 నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న జేఎంబీ బుర్ధ్వాన్ బాంబు పేలుళ్ల అనంతరం అందరి దృష్టినీ ఆకర్షించింది. 2014 అక్టోబర్ 2న జరిగిన బుర్ధ్వాన్ బాంబు పేలుళ్ల ఘటనను విచారించిన ఎన్ఐఏ పలువురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. జేఎంబీపైనా పలు అభియోగపత్రాలను నమోదు చేసింది. ఇక భారత్లో రిక్రూట్మెంట్ను వేగవంతం చేసేందుకు జేఎంబీ సభయులు పేద, అణగారిన కుటుంబాలకు చెందిన యువతులను ఎంచుకుంటున్నట్టు గుర్తించారు.
బెంగాల్లోని పలు ప్రాంతాల్లో మదర్సాలు నిర్వహిస్తున్న జేఎంబీ శ్రేణులు వాటి ద్వారా దేశీ యువతులను ఎంపిక చేసుకుని పెండ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని వెల్లడైంది. వివాహం జరిగిన వెంటనే యువతుల కుటుంబ సభ్యులనూ ఉగ్ర సంస్ధలో చేర్చుకుంటున్నారని ఎన్ఐఏ గుర్తించింది.