న్యూఢిల్లీ: ఖలిస్థాన్ ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్ల సంబంధాలను ఛేదించే లక్ష్యంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) దాడులు చేపట్టింది. బుధవారం ఐదు రాష్ర్టాలు, రెండు యూటీల్లోని 53 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొన్నట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. వారి నుంచి పిస్టోళ్లు, మందుగుండు సామగ్రి, డిజిటల్ పరికరాలను సీజ్ చేశామని తెలిపారు.
ఉగ్రవాది అర్ష్ దల్లా సహచరులు, పలువురు కరుడగట్టిన గ్యాంగ్స్టర్లపై నమోదైన కేసులకు సంబంధించి ఈ దాడులు చేపట్టినట్టు ఎన్ఐఏ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలు సహా ఢిల్లీ, చండీగఢ్ యూటీల్లో ఈ దాడులు జరిగాయని తెలిపారు. ఉగ్ర సంస్థలు, మాదకద్రవ్యాల స్మగ్లర్లతో పనిచేసే గ్యాంగ్స్టర్లను పట్టుకోవడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని వివరించారు.