సిటీ బ్యూరో (నమస్తే తెలంగాణ): దేవభూమి జోషీమఠ్లో ఉన్నపళంగా మారిపోతున్న భౌగోళిక పరిణామాల కారణాలను తేల్చేందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. రెండు రోజుల్లో జోషీమఠ్ చేరుకోనున్న సైంటిస్టుల బృందం వారం రోజుల్లో సమగ్ర నివేదిక అందించనుంది. కొండపై ఏటవాలుగా ఏర్పడిన జోషీమఠ్ 1972 నుంచి అత్యంత ప్రమాదకర ప్రాంతంగానే ఉందని ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆనంద్ కుమార్ పాండే తెలిపారు. పట్టణీకరణ, భూగర్భ జలాల పొరల్లో కలిగిన లింకేజీ భూమి కుంగడానికి కారణమై ఉండొచ్చని ఆయన అన్నారు.
జోషీమఠ్లో ప్రత్యేక పరికరాలతో అధ్యయనం చేస్తామన్నారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్(జీపీఆర్), ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ(ఈఆర్టీ), మల్టీ ఛానెల్ అనాలసిస్ ఆఫ్ సర్ఫెస్ వేవ్(మాస్వా) పరికరాలతో భూ, భూగర్భ జలాలు, భూకంప తీవ్రత, భూమి అడుగున చోటుచేసుకున్న ఒత్తిళ్లను అంచనా వేస్తామని వెల్లడించారు. జోషీమఠ్ మనుగడపై భౌగోళిక అంశాలను అధ్యయనం చేయడంలో ఎన్జీఆర్ఐ పరిశోధనలు కీలకంగా మారుతాయన్నారు. శాస్త్రీయ కోణంలో జరిగే అధ్యయనంతో అసలు కారణాలు తెలుస్తాయని అన్నారు.