న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్న అంశంపై ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం .. కేంద్ర ఆరోగ్యశాఖతో భేటీ అయ్యింది. ఆ సమయంలో పలు అంశాలను అధికారులు చర్చించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలన్న ఆలోచనలో కేంద్ర ఎన్నికల సంఘం లేనట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది జఅయిదు రాష్ట్రాల్లో జరగాల్సిన ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నట్లు కొన్ని ప్రభుత్వ వర్గాల ద్వారా వెల్లడైంది. ఈ నేపథ్యంలో మంగళవారం యూపీలో ఎన్నికల సంఘం అధికారులు పరిశీలనకు వెళ్లనున్నారు. ఎన్నికల వేళ రక్షణ కల్పించే పారామిలిటరీ దళాల చీఫ్లతోనూ ఎన్నికల సంఘం భేటీకానున్నది. వ్యాక్సిన్ కవరేజీ గురించి కూడా ఇవాళ జరిగిన భేటీలో ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఒమిక్రాన్ టాప్ గేర్లో ఉన్నా.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ఆలోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
మరోసారి భేటీ..
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం భేటీ అయ్యారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. అయితే వచ్చే సంవత్సరం జనవరి 22న మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశం తర్వాతే ఎన్నికలను నిర్వహించాలా? వద్దా? అన్న విషయంలో ఈసీ తుది నిర్ణయాన్ని ప్రకటించే ఛాన్సు ఉంది.