భువనేశ్వర్: అప్పుడే పుట్టిన పసి బిడ్డను (Newborn Girl) బోరుబావిలో పడేశారు. పసి పాప ఏడ్పు విన్న స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెస్క్యూ సిబ్బంది ఏడు గంటలపాటు శ్రమించి నవజాత శిశువును కాపాడారు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లారిపాలి గ్రామంలో వినియోగంలో లేని బోర్వెల్లో అప్పుడే పుట్టిన పసి బాలికను పడేశారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పసి బిడ్డ ఏడ్పు విన్న గ్రామస్తులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్య బృందాలను రప్పించి బోరుబావిలోకి ఆక్సిజన్ సరఫరా చేశారు.
కాగా, భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో అధునాతన కెమెరాను రప్పించారు. బోరుబావిలోని 13 అడుగుల లోతులో పసి బాలిక చిక్కుకున్నట్లు గుర్తించారు. జేసీబీలతో తవ్వకాలు చేపట్టారు. సుమారు ఏడు గంటలపాటు రెస్క్యూ సిబ్బంది శ్రమించారు. చివరకు మంగళవారం రాత్రి 9.40 గంటలకు ఆ పసి బాలికను సురక్షితంగా బోరువెల్ నుంచి బయటకు తీసి కాపాడారు. వెంటనే బుర్లా వీఐఎంఎస్ఏఆర్ ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత సంరక్షణ విభాగానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పసి బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
మరోవైపు నవజాత శిశువును బోర్వెల్లో పడేసిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.