సూరత్: ఒక మహిళ ఆసుపత్రిలో శిశువుకు జన్మనిచ్చింది. టీకా వేయిస్తానని తీసుకెళ్లిన వ్యక్తి ఆ నవజాత శిశువును అపహరించాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆరేళ్ల తర్వాత ఆ చిన్నారి ఆచూకీని గుర్తించారు. పెంచిన వారి వద్దనే తాను ఉంటానని ఆ బాలుడు చెబుతున్నాడు. గుజరాత్లోని సూరత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సూఫియా మన్సూరి అనే మహిళకు ముంబైకి చెందిన వ్యక్తితో పెళ్లైంది. గర్భం దాల్చిన ఆమె కాన్పు కోసం గుజరాత్ కఠోరే గ్రామంలోని పుట్టింటికి వచ్చింది. 2017 జనవరి 4న స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో బాబుకు జన్మనిచ్చింది.
కాగా, టీకా వేయించాలంటూ ఆ శిశువును తీసుకెళ్లిన వ్యక్తి అపహరించాడు. ఎంతకీ బాబును తిరిగి తీసుకురాకపోవడంతో ఆసుపత్రి అంతా వెతికారు. శిశువు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చివరకు కమ్రెజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాప్ అయిన బాబు కోసం ఆరేళ్లుగా వెతికారు.
చివరకు ఆరేళ్ల వయసున్న ఆ బాలుడు కర్జన్ ప్రాంతంలో ఉంటున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో ఆ బాలుడ్ని పెంచుతున్న కమలేష్ ఓడ్, ఆయన భార్య నయనను అరెస్ట్ చేశారు. వారిని ప్రశ్నించగా తమ నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. కమిలేష్ అంబులెన్స్ సర్వీస్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అని చెప్పారు.
మరోవైపు ఆరేళ్ల బాలుడి జీవ సంబంధాన్ని నిర్ధారించేందుకు అసలు తల్లిదండ్రులకు డీఎన్ఏ టెస్ట్ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. కాగా ఆ బాలుడ్ని తమకు అప్పగించాలని కన్న తల్లిదండ్రులు కోర్టును కోరారు. అయితే పెంచిన వారి వద్దనే ఉంటానని ఆ బాలుడు కోర్టుకు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ బాలుడ్ని శిశు సంరక్షణ కేంద్రానికి అప్పగించారు.