కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు ప్రపంచం మొత్తం రెడీ అయిపోయింది. అదే సమయంలో ప్రపంచంపై పంజా విసిరేందుకు తాచుపాములా కరోనా కాచుకు కూర్చుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన కొన్ని ప్రభుత్వాలు కొత్త సంవత్సరం సంబరాలపై ఆంక్షలు విధించాయి. అలా మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు, నగరాలు ఆంక్షలు విధించాయి. అవేంటో ఒకసారి చూద్దామా?
దేశరాజధాని ఢిల్లీలో కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూసేందుకు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కరోనా కేసులు వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) ఇక్కడ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా నిబంధనలకు సంబంధించి డీడీఎంఏ మార్గదర్శకాలను విడుదల చేసింది.
కరోనాతో పోరాడేందుకు ప్రకటించిన ఈ నిబంధనల్లలో నైట్ కర్ఫ్యూ ఒకటి. ఇది అమలు చేసేందుకు రద్దీ ప్రాంతాల్లో పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్ల వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించాలని, అలాగే ప్రతి హోటల్ సమీపంలో ఒక పెట్రోల్ వెహికల్ ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మొత్తం 153 ఒమిక్రాన్ కేసులు నమోదవగా.. వారిలో కేవలం 12 మంది మాత్రమే విదేశీ ప్రయాణాలు చేశారు. అంటే మిగతా వాళ్లందరికీ ఇక్కడే ఒమిక్రాన్ సోకింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ నిషేధించింది. వచ్చే ఏడాది జవనరి 7 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ముంబై డిప్యూటీ కమిషనర్ చైతన్య వెల్లడించారు. కొత్త సంవత్సర వేడుకలతోపాటు ఫంక్షన్లు, ఇతరత్ార కార్యక్రమాలను కూడా నిషేధిస్తున్నట్లు తెలిపారు.
మహారాష్ట్రలో కూడా కఠినమైన కరోనా నిబంధనలు అమల్లో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా న్యూఇయర్ సెలబ్రేషన్స్ను ప్రభుత్వం బ్యాన్ చేసింది. కన్ఫైన్డ్ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో 50శాతం, బహిరంగ ప్రాంతాల్లో జరిగే ఈవెంట్లలో 25శాతం మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతులు ఇచ్చింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా కొత్త సంవత్సర వేడుకలు జరగడం లేదు. ఇక్కడ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం (జనవరి 1) ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. పబ్లిక్ ప్రాంతాల్లో కొత్త సంవత్సర వేడుకల కోసం ఐదుగురి కన్నా ఎక్కువ మంది కలవడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇళ్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్సులు, ప్రైవేట్ క్లబ్స్లో సెలబ్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
‘‘హోటల్స్, మాల్స్, రెస్టారెంట్లు, క్లబ్బులు ఎటువంటి ప్రత్యేక కార్యక్రమాలు, డీజే ఏర్పాట్లు చేయకూడదు. అయితే కరోనా నిబంధనలు కొనసాగిస్తూ మామూలుగా వ్యాపారం చేసుకోవచ్చు’’ అని ప్రభుత్వం పేర్కొంది. ఈ రాష్ట్రంలో డిసెంబరు 28 నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో జరిగే సెలబ్రేషన్స్పై నిషేధం విధించిన ప్రభుత్వం.. రెస్టారెంట్లలో 50శాతం కన్నా తక్కువ మందితో సెలబ్రేషన్స్ చేసుకునేందుకు అనుమతించింది. అలాగే ఈ ఈవెంట్లలో పాల్గొనే వాళ్లు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతించాలని నిబంధన విధించింది.
‘‘సిటీ ఆఫ్ జాయ్’’గా పిలిచే కోల్కతాలో కూడా ఈసారి కొత్త సంవత్సర వేడుకలకు బ్రేకులు పడ్డాయి. డిసెంబరు 31న ఎటువంటి కార్యక్రమాలూ జరగకుండా చూసుకునేందుకు ఇక్కడ సుమారు 3,500 మంది పోలీసులు రంగంలోకి దిగారు. అంతేకాదు శుక్రవారం రాత్రి పది గంటల నుంచి మరింత పర్యవేక్షణ పెరుగుతుందని సమాచారం. నగరంలో రాత్రిపూట 20 మోటార్ సైకిళ్లపై పెట్రోలింగ్ చేయనున్నారని, అలాగే మరో రెండు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ను రంగంలోకి దించుతామని పోలీసులు తెలిపారు.
అంతేకాదు, పార్క్ స్ట్రీట్ ఏరియాలో మొత్తం 11 వాచ్టవర్లను ఏర్పాటు చేశారు. నగరంలో 22 పీసీఆర్ వ్యాన్లు, గంగా నదిలో రెండు రివర్ ట్రాఫిక్ బృందాలు గస్తీ తిరగనున్నాయి. కోల్కతాలో మొత్తం 95 చెక్పాయింట్ల వద్ద కార్లలో తనిఖీలు నిర్వహించనున్నారు. అవసరమైతే రంగంలోకి దిగేందుకు కంబాట్ ఫోర్స్ను కూడా పోలీసులు సిద్ధం చేసినట్లు సమాచారం.
న్యూఇయర్ సెలబ్రేషన్స్పై నిషేధం విధించిన మరో రాష్ట్రం ఒడిశా. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకున్న పోలీసులు.. హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, పిక్నిక్ స్పాట్స్, షాపింగ్ కాంప్లెక్సులు తదితరాల్లో ర్యాండమ్ చెకింగ్ నిర్వహించనున్నారు. ఎవరైనా కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది.
ఇక్కడ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త మార్గదర్శకాలు జనవరి 1 ఉదయం 5 గంటల నుంచి ఫిబ్రవరి 1 వరకూ అమలవుతాయి. ఈ సమయంలో 100 మంది కన్నా ఎక్కువ మందితో రాజకీయ నాయకులు కూడా మీటింగులు నిర్వహించకూడదు. అంతేకాదు, అన్ని అర్బన్ ప్రాంతాల్లో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ కర్ఫ్యూ అమలవుతుంది.
ఇక్కడ నైట్ కర్ఫ్యూ కఠినంగా అమలవుతోంది. ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి ప్రార్థనా స్థలాలకు ఈ కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తూ ప్రభుత్వం కొత్తగా ప్రకటన విడుదల చేసింది. అయితే ఏ ఇతర ప్రాంతమైనా రాత్రి పది గంటల తర్వాత క్లోజ్ అయిపోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ఈ నిబంధనలు జనవరి 2 వరకూ అమల్లో ఉంటాయి.
అంతేకాదు, అనవసర ప్రయాణాలను నిరోధించేందుకు కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఎవరైనా ఇళ్ల నుంచి బయటకు వచ్చే సమయంలో ఎందుకు వచ్చింది తెలుపుతూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. క్లబ్బులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు ఏవీ కూడా రాత్రి పది దాటిన తర్వాత తెరిచి ఉంచడానికి కేరళలో అనుమతుల్లేవు.
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కూడా న్యూఇయర్ సెలబ్రేషన్స్పై నిషేధం ఉంది. ఇక్కడ శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి తీసుకొస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజు మినహాయించి వచ్చే జనవరి 31 వరకూ ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. కరోనాను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన చేసింది. ఇక్కడ కొత్త కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, పుదుచ్చేరిలో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసినందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
కొత్త సంవత్సర వేడుకలకు రెండ్రోజుల ముందే మణిపూర్లో మరోసారి నైట్ కర్ఫ్యూ నిబంధన తీసుకొచ్చారు. ఇక్కడ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లో ఉంది. నిత్యావసర సరుకులు, మెడికల్ ఎమర్జెన్సీలకు మినహాయింపు ఇచ్చారు. అయితే మ్యూజిక్ కాన్సెర్టులు, తబల్ చోంగ్బా (ఫోక్ డ్యాన్స్), విందులు, వినోదాలు వంటిని ప్రభుత్వం నిషేధించింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎడారి రాష్ట్రం రాజస్థాన్లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. అయితే కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని రెస్టారెంట్లు మరో రెండు గంటలు అదనంగా వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇక్కడ రాత్రి 11 నుంచి 1 వరకూ రెస్టారెంట్లు నడుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే నైట్ కర్ఫ్యూను కఠినంగా అమలు చేయాలని బుధవారం నాడు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న ప్రజలనే పబ్లిక్ ప్లేసుల్లోకి అనుమతించాలని తేల్చిచెప్పింది.
న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలా మంది టూరిస్టులు వెళ్లే ప్రాంతం గోవా. ఇక్కడ ఎటువంటి నైట్ కర్ఫ్యూ లేదు. అయితే ఈవెంట్లలో పాల్గొనే వారి వద్ద నెగిటివ్ ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్ కానీ, లేదంటే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నట్లు ధ్రువీకరణ కానీ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది.
రాష్ట్రంలోని బీచ్లలో ఎటువంటి సెలబ్రేషన్స్ జరగకుండా తమిళనాడు రాష్ట్రం నిషేధం విధించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఇళ్లలోనే కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని సూచించింది. పబ్లిక్ ప్లేసులలో గుంపులు కట్టొద్దని స్పష్టం చేసింది. కరోనా మార్గదర్శకాల ప్రకారమే రెస్టారెంట్లు తదితర కమర్షియల్ వ్యాపారాలు రాత్రి 11 వరకూ కొనసాగవచ్చని తెలిపింది.