న్యూఢిల్లీ: న్యాయమూర్తులపై ప్రభుత్వ దుష్ప్రచారం కొత్త పంథా అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్వీ రమణ విమర్శించారు. ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ‘కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. న్యాయమూర్తులపై ప్రభుత్వం దుష్ప్రచారం ప్రారంభించింది. ఇది దురదృష్టకరం’ అని అన్నారు. గతంలో ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కుయుక్తులకు పాల్పడేవారని, ప్రస్తుతం ప్రభుత్వమే అలాంటి వాటికి పాల్పడుతున్నదని విమర్శించారు. తాము ప్రతిరోజు కోర్టుల్లో వీటిని చూస్తున్నామని ఆయన అన్నారు.
బీజేపీకి చెందిన ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, ప్రిన్సిపల్ కార్యదర్శి అమన్ సింగ్, ఆయన భార్య యాస్మిన్ సింగ్పై అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసును ఛత్తీస్గఢ్ హైకోర్టు 2020లో కొట్టివేసింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ముగ్గురు అవినీతిపై దర్యాప్తు జరుపాలని ప్రభుత్వాన్ని కోరిన సామాజిక కార్యకర్త ఉచిత్ శర్మ, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
సీజేఐ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు కృష్ణ మురారి, హిమా కొహ్లిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే న్యాయస్థానాన్ని ఆగ్రహానికి గురిచేసిన అంశం ఏమిటన్నది స్పష్టం కాలేదు.