న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: హైవేలపై ప్రయాణించే వాహనదారులకు విధించే టోల్ రేట్లపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన టోల్ రేట్లు ఈసారి ఎన్నికల తర్వాతే అమలులోకి రానున్నాయి. సాధారణంగా కొత్త రేట్లు ప్రతి ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేస్తారు. అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొత్త రేట్లపై నేషనల్ హైవే అథారిటీ ఎన్నికల సంఘం అనుమతి కోరింది. దీనిపై కొత్త రేట్లపై నిర్ణయం తీసుకోవాలని, అయితే ఎన్నికలైన తర్వాత మాత్రమే దానిని అమలు చేయాలని కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. సాధారణంగా ఇప్పుడు అమలవుతున్న టోల్ రేట్లకు 5 శాతం పెంచి కొత్త రేట్లను నిర్ణయిస్తుంటారు.