పాట్నా: కొత్త టెక్నాలజీ ఖచ్చితంగా సమస్యలను సృష్టిస్తుందని, ఈ విషయాన్ని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. పలువురు ప్రముఖుల మొబైల్ ఫోన్లు హ్యాక్ అయ్యాయన్న ‘పెగాసస్ ప్రాజెక్ట్’ నివేదికపై సోమవారం ఆయన స్పందించారు. ఇలాంటి కొత్త సాంకేతికతలు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ప్రజలు కూడా వాటిని దుర్వినియోగం చేసే అవకాశమున్నదని తెలిపారు. సోషల్ మీడియా ప్రజలపై చాలా ప్రభావం చూపుతున్న విషయాన్ని నితీశ్ కుమార్ గుర్తు చేశారు. ఇలాంటి అంశాలను మనం పరిశీలించాలని ఆయన వ్యాఖ్యానించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలపై సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉన్నదని అన్నారు. అయితే చర్చల ద్వారా రైతులను ఒప్పించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైతులతో చర్చలు జరిపిన సంగతిని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎవరికీ వ్యతిరేకంగా లేవని అన్నారు. అయితే రైతులకు భావోద్వేగాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారితో మళ్ళీ చర్చలు జరుపాలని నితీష్ కుమార్ సూచించారు.