Work From Home | వర్క్ ఫ్రమ్ హోంపై వాణిజ్య మంత్రిత్వశాఖ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేసింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ల (SEZ’s)లో పని చేసేవారికి వారికి గరిష్ఠంగా ఏడాది పాటు వర్క్ ఫ్రమ్ హోం పని చేసేందుకు అనుమతి ఇచ్చింది. మొత్తం ఉద్యోగుల్లో గరిష్ఠంగా 50శాతం వరకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేయవచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ రూల్స్, 2006 ప్రకారం.. వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్త రూల్ 43Aని వాణిజ్య శాఖ ప్రకటించింది.
పారిశ్రామిక రంగం నుంచి వచ్చిన డిమాండ్ మేరకు నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఏడాది పూర్తయినా సరే కొన్ని సందర్భాల్లో ఉద్యోగులకు మరో ఏడాది పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ను కొనసాగించే వెసులుబాటును కల్పించింది. అయితే, 50శాతానికి మించి ఉద్యోగులు ఇంటి వద్ద నుంచి పనిచేయాలంటే.. సంబంధిత కారణాల్ని రాతపూర్వకంగా వివరిస్తూ సెజ్ల డెవలప్మెంట్ కమిషనర్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఐటీ, సెజ్ రంగాల్లోని కొన్ని కేటగిరిల ఉద్యోగులకు వర్తిస్తుందని పేర్కొంది. కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించలేని ఉద్యోగులకు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి పనిచేసే వారికి, ఆఫ్సైట్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఇంటి వద్ద నుంచే పని చేసుకోవచ్చు. ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న సెజ్ యూనిట్లకు సంబంధించిన ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు అమలు చేసేందుకు మూడు నెలల సమయం ఇచ్చింది.