న్యూఢిల్లీ: నూతన ఐటీ నిబంధనలు యూజర్లకు సాధికారత కల్పించడంతోపాటు వారి భద్రత సేఫ్టీ కోసమని కేంద్ర నూతన ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. సోషల్ మీడియా వేదికల కట్టడికి భారత్లో ఈఏడాది మే 25నుంచి నూతన ఐటీ చట్టం నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.
దేశంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సురక్షిత, బాధ్యతాయుతమైన వాతావరణంలో కార్యకలాపాలు కొనసాగించడానికి ఈ కొత్త నిబంధనలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నూతన ఐటీ చట్టం అమలవుతున్న తీరుపై ఆయన సమీక్ష జరిపారు.
‘దేశంలో నూతన ఐటీ చట్టం అమలు, సోషల్ మీడియా వేదికల్లో అభ్యంతరకర పోస్టులను తొలగింపుతో పాటు నెలవారీ నివేదికలను సమర్పించడంపై సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో కలిసి సమీక్షించాను’ అని తెలిపారు.
‘నూతన ఐటీ నిబంధనలు యూజర్లను మరింత శక్తిమంతం చేయడంతో పాటు వారికి పూర్తి రక్షణ కల్పిస్తాయి. మరోవైపు దేశంలో బాధ్యతాయుత వాతావరణంలో సోషల్ మీడియా వేదికలు పనిచేయడంలో ఇవి ఎంతో దోహదపడతాయి’ అని అశ్విని వైష్ణవ్ ‘కూ’ యాప్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా నిబంధనలను పాటించకపోవడంతో 1.75 కోట్ల మేర వినియోగదారులు ఉన్న ట్విటర్ గత నెల మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది. దీంతో పలువురు యూజర్లు చేసిన అభ్యంతరకర పోస్టులకు ట్విటర్పై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.