కొత్తగా వచ్చే కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలు ముద్రించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు భారత కరెన్సీ నోట్లపై కేవలం మహాత్మాగాంధీ చిత్రం మాత్రమే ముద్రించారు. అయితే తొలిసారి గాంధీ కాకుండా ఇతరుల చిత్రాలతో కరెన్సీ ముద్రించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనిపై 2017లోనే ప్రతిపాదనలు వచ్చినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే త్వరలోనే వీటిపై ఒక నిర్ణయానికి రావాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ మేరకు కొత్త వాటర్మార్కులు ఉన్న నోట్లను ఐఐటీ ఢిల్లీ ఎమెరిటస్ ప్రొఫెసర్ దిలీప్ టి. షాహనీకి పంపారట. ఆయనే గాంధీ, ఠాగూర్, కలాం చిత్రాలలో ఒకదాన్ని ఎంపిక చేస్తారట.
ఆయన సెలెక్ట్ చేసిన నోటును ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపనున్నట్లు సమాచారం. లేదంటే మూడింటినీ ప్రభుత్వ ఆమోదం కోసం పంపుతారట. అయితే వీటిలో వేటిని ముద్రించాలనే నిర్ణయం మాత్రం అత్యున్నత స్థాయిలో తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.