చండీగఢ్ : పంజాబ్ ప్రభుత్వం వివాదంలో చిక్కుకున్నది. ముఖ్యమంత్రి కార్యాలయంలో మహారాజా రంజిత్ సింగ్ (Lion of the Punjab) ఫొటోను తొలగించిన వ్యవహారంలో రగడ మొదలైంది. చిత్రపటం తొలగింపుపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. పంజాబ్ సీఎంగా మాన్ ఖట్కర్ కలాన్ గ్రామంలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం కార్యాలయంలో భగవత్ మాన్ బాధ్యతలు స్వీకరించారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటకు రాగా.. సీఎం వెనుకల గోడపై భగత్ సింగ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలు మాత్రమే కనిపించడంతో బీజేపీ అభ్యంతరం తెలిపింది. బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాలపై ఎలాంటి అభ్యంతరం లేదని, షేర్ ఏ పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ చిత్రాన్ని ఎందుకు తొలగించారని బీజేపీ పంజాబ్ ప్రధాన కార్యదర్శి సుభాష్ శర్మ డిమాండ్ చేశారు. వెంటనే సీఎం క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ విషయంపై మాజీ సీఎం అమరిందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్ సైతం అభ్యంతరం వ్యక్తం చేసింది. రంజిత్ సింగ్ చిత్రపటాన్ని తొలగించడం ఆమోదయోగ్యం కాదని
పేర్కొన్నది.