భువనేశ్వర్ : ఒడిశాలో కొత్త మంత్రివర్గం ఆదివారం కొలువుదీరింది. మంత్రులుగా 21 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర సచివాలయం లోక్సేవా భవన్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ గణేశిలాల్ ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. కొత్త మంత్రి వర్గంలో 13 మందికి కేబినెట్ హోదా, మరో ఎనిమిది మందికి స్వతంత్ర హోదా దక్కింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారం కేబినెట్ మంత్రులందరినీ రాజీనామా చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ ఇటీవలే 23 ఏళ్ల పదవిని పూర్తి చేసుకున్న పట్నాయక్ 2024 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు నిర్ణయించారని, ఇందులో భాగంగానే కేబినెట్ మంత్రులను రాజీనామా చేయించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ఒడిశా రాజకీయ చరిత్రలో మంత్రులందరినీ రాజీనామా చేయాలని ఆదేశించడం ఇదే తొలిసారి. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మే 29తో మూడేళ్లు పూర్తి చేసుకుంది.
ఇదిలా ఉండగా.. గిరిజన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేత జగన్నాథ్ సరాకా కేబినెట్ మంత్రిగా తొలి ప్రమాణం చేశారు. సరాకా ఇప్పటి వరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా.. ఆయనకు కేబినెట్ మంత్రిగా నవీన్ పట్నాయక్ పదొన్నతిని కల్పించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో సీనియర్ బీజేడీ నేత నిరంజన్ పుజారీ, అతాగడ్ ఎమ్మెల్యే రానేంద్ర ప్రతాప స్వెయిన్, ప్రమీలా మల్లిక్, ఉషా దేవి, ప్రతాప్ దేబ్లతోపాటు ప్రఫుల్లా మల్లిక్, మహాకల్పద ఎమ్మెల్యే అతాను సబ్యసాచి నాయక్ ఉన్నారు.