న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థతో మరో వివాదానికి కేంద్రం ప్రభుత్వం తెరతీసింది. ఎన్నికల సంఘం నియామకాలకు సంబంధించిన సెలక్షన్ ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ)ని చేర్చలేదు. ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, క్యాబినెట్ మంత్రితో కూడిన ముగ్గురు సభ్యుల ప్యానెల్ మాత్రమే ఎన్నికల సంఘం నియామకాలను రాష్ట్రపతికి సిఫార్సు చేస్తుంది. ఈ మేరకు ప్రతిపాదించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్ల (సర్వీస్, నియామక నిబంధనలు, పదవీకాలం) బిల్లు 2023ను (New bill) రాజ్యసభలో గురువారం కేంద్రం ప్రవేశపెట్టనున్నది.
కాగా, ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిని నిర్ధారించేందుకు ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టు
ఒక స్పష్టత ఇచ్చింది. ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్షనేత, సీజేఐతో కూడిన కమిటీ సలహా మేరకు ఎన్నికల సంఘానికి నియామకాలు జరుపాలని తెలిపింది. ఎన్నికల సంఘం ఎంపిక విధానంపై పార్లమెంట్ ఒక చట్టాన్ని రూపొందించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది. జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.
మరోవైపు సుప్రీంకోర్టు తీర్పునకు ముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లను కేంద్రం సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించేవారు. కాగా, సెలక్షన్ కమిటీలో ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేతతోపాటు సీజేఐ ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే సుప్రీంకోర్టు సూచనను కేంద్రం పట్టించుకోలేదు. కొత్త బిల్లులో ప్రతిపాదించిన ముగ్గురు సభ్యుల సెలక్షన్ ప్యానెల్ నుంచి సీజేఐని మినహాయించింది.
కాగా, ఇప్పటికే న్యాయమూర్తుల నియామకాల నుంచి ఢిల్లీ సర్వీసుల చట్టం వంటి అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య విభేదాలున్నాయి. ఈ తరుణంలో కేంద్రం తెచ్చిన కొత్త ఎన్నికల సంఘం బిల్లు సర్వోన్నత న్యాయస్థానానికి మరింత ఆగ్రహాన్ని కలిగించేలా ఉన్నది.