పాట్నా: జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ 2017లో బీజేపీతో పొత్తు తర్వాత సంతోషంగా కనిపించలేదని, బలవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా ఆయన ఫీల్ అయ్యారని బీహార్కు చెందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగిన నితీశ్ కుమార్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి మద్దతుతో మరోసారి సీఎంగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో జేడీయూ మాజీ నేత అయిన ప్రశాంత్ కుమార్ దీనిపై స్పందించారు. బీహార్లో గత పదేళ్లుగా రాజకీయ అస్థిరత యుగం కొనసాగుతోందని, ప్రస్తుత పరిణామాలు కూడా ఆ దిశగానే ఉన్నాయని తెలిపారు. దీనికి నితీష్ కుమార్ ప్రధాన పాత్రధారి, సూత్రధారి అని చెప్పారు. 2013 నుంచి బీహార్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఇది 6వ ప్రయత్నమని అన్నారు. ఒకరి రాజకీయ లేదా పరిపాలనా అంచనాలు నెరవేరనప్పుడు నిర్మాణాలు మారుతాయని వ్యాఖ్యానించారు.
కాగా, 2015 కూటమి ప్రభుత్వం , ప్రస్తుత మహాకూటమి ప్రభుత్వం పూర్తిగా వేరని ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2015 కూటమి ప్రభుత్వం రాజకీయ స్వభావంతో కూడుకున్నదని, 2022 మహాకూటమిలో పరిపాలన దృక్కోణం ఎక్కువగా ఉందని తెలిపారు. అయితే కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పనిచేస్తుందా లేదా అనేది చూడాల్సి ఉందన్నారు. కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నట్లుగా నితీష్ కుమార్ చెప్పారని, దీంతో బీహార్ ప్రజల ఆకాంక్షలను ఆయన నెరవేరుస్తారని, బీహార్ రాజకీయాల్లో స్థిరత్వం తిరిగి నెలకొంటుందని తాను ఆశిస్తున్నానని అన్నారు. బీహార్లో ఏకైక అతిపెద్ద పార్టీ నాయకుడైన తేజస్వి యాదవ్ కొత్త ప్రభుత్వంలో ప్రధాన పాత్ర పోషిస్తారని అంచనా వేశారు.
మరోవైపు 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ ఉంటారన్న ఊహాగానాలను ప్రశాంత్ కిషోర్ తిరస్కరించారు. ఆయనకు అలాంటి ఆశ లేదని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. బీహార్ రాజకీయాల్లోనే కీలకంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. బీహార్లో తాజా రాజకీయ పరిణామాలు రాష్ట్రానికి సంబంధించినవేనని తాను నమ్ముతున్నానని తెలిపారు. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ప్రతిపక్షాన్ని సృష్టించాలనే ఆలోచనతో ఇది జరిగిందని తాను అనుకోవడం లేదన్నారు.