న్యూఢిల్లీ, డిసెంబర్ 8: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సామూహిక వలసలు అమెరికన్ల కలలను చోరీ చేయడమేనంటూ వాన్స్ చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాన్స్ వ్యాఖ్యలను కపటత్వం, విద్వేషపూరితంగా అభివర్ణించిన నెటిజన్లు భారతీయ వలసదారుల కుమార్తె అయిన తన భార్య ఉషను భారత్కు తిప్పిపంపించేయాలని వాన్స్ను కోరారు. సామూహిక వలసలు అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను కొల్లగొడతాయని ఎక్స్ పోస్టులో వాన్స్ వ్యాఖ్యానించారు. పాత వ్యవస్థ ద్వారా ధనవంతులవుతున్న వ్యక్తులే తన అభిప్రాయాలను వ్యతిరేకిస్తున్న వారికి నిధులు సమకూర్చుతున్నారని ఆయన ఆరోపించారు.