(స్పెషల్ టాస్క్ బ్యూరో):హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఆరేండ్ల ఎడంతో జరిగిన ఈ రెండు ఘటనలు తీవ్ర విషాదమైనవే. అయితే, దేశానికి ప్రధాని అయిన ఓ వ్యక్తి వీటిపై ఏ విధంగా స్పందించాలి? రెండు ఘటనలను వేర్వేరుగా చూస్తే, ఆ వ్యక్తిని ప్రధానిగా అనుకోగలమా? అయితే, మన గౌరవ ప్రధాని మోదీ ఈ రెండు ఘటనలపై రాజకీయ కోణంలో స్పందించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతున్నది. విపక్ష ప్రభుత్వం తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న బెంగాల్లో 2016లో జరిగిన ఫ్లైఓవర్ కూలిన ఘటనపై గతంలో మోదీ రాజకీయ ప్రయోజనాల కోణంలో స్పందించారు. ‘ఫ్లైఓవర్ కూలడం ఎన్నికల సమయంలో జరిగింది. అంటే దేవుడు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఈ రోజు బ్రిడ్జి ఘటనకు కారణమైన సీఎం మమత ప్రభుత్వం.. రేపు యావత్తు బెంగాల్ను అంతం చేస్తుంది. తృణమూల్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఫ్లైఓవర్ రూపంలో దేవుడు ప్రజలకు ఓ సందేశం ఇచ్చాడు’ అంటూ 2016, ఏప్రిల్ మొదటివారంలో ఓ ఎన్నికల ర్యాలీలో ప్రధాని వ్యాఖ్యానించారు. ఆరేండ్లు గడిచింది. బీజేపీపాలిత గుజరాత్ ప్రభుత్వం వైఫల్యంతో ఆదివారం మోర్బీలోని ఓ తీగల వంతెన నదిలో కూలిపోయింది. 141 మంది మరణించారు. దీనిపై స్వరాష్ట్ర పర్యటనలోనే ఉన్న అదే మోదీ స్పందించారు. ‘ప్రస్తుతం ఏక్తానగర్లో ఉన్నప్పటికీ.. నా ఆలోచనలన్నీ మోర్బీ బాధితుల చుట్టే తిరుగుతున్నాయి. ఇంతటి బాధను అనుభవించిన సందర్భాలు తక్కువ. ఒకవైపు గుండెలనిండా విషాదం నిండిఉన్నా.. తప్పకుండా నిర్వహించాల్సిన విధులు ముందున్నాయ్. ఈ ప్రమాదం నన్నెంతో బాధిస్తున్నది. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ద్వంద్వ వైఖరిపై విపక్షాలు, నెటిజన్లు మండిపడుతున్నారు. ‘దేశానికి ప్రధాని అయిన మీరు రెండు ఘటనలో భిన్నంగా అలా ఎలా స్పందిస్తారు?’, ‘ఇప్పుడు ఈ ఘటనతో గుజరాత్లోని బీజేపీ సర్కారును కూల్చివేయాలంటూ దేవుడు సందేశమిచ్చినట్లేగా’, ‘బీజేపీ సర్కారు నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఒప్పుకున్నట్లేనా మోదీ గారూ..’, ‘ఈ విషాద ఘటనకు మీ సర్కారు బాధ్యత తీసుకోవాలి!’ అంటూ సోషల్మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కోల్కతా విషాదాన్ని ఒకలా, గుజరాత్ విషాదాన్ని మరో లా చూస్తున్న మోదీ.. కేవలం గుజరాత్కే ప్ర ధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
రిపబ్లిక్ జర్నలిస్టులపై దాడి:మోర్బి ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి
భూపేంద్రపటేల్ను ప్రశ్నించిన రిపబ్లిక్ టీవీ జర్నలిస్టులపై ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది దాడికి పాల్పడ్డారు. కెమెరాలను అడ్డుకున్నారని, ఫోన్లు లాక్కున్నారని రిపబ్లిక్ టీవీ సిబ్బంది తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రిని మరోసారి రిపబ్లిక్ టీవీ జర్నలిస్టులు ప్రశ్నించగా ఆయన జవాబు ఇవ్వకుండానే అక్కడి నుంచి జారుకున్నారు.
యూపీలో కూలిన వంతెన
యూపీలో పెద్ద ప్రమాదం తప్పింది. చాకియా మండలం చందౌలీలో చఠ్పూజలో భాగంగా ప్రజలు సూర్యుడికి పూజలు చేసి వస్తుండగా వంతెన కూలింది. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి.
సోషల్మీడియాపై సెన్సార్
రాజకీయ లబ్ధి కోసం తమకు ప్రయోజనకరంగా ఉన్న వార్తలనే వైరల్ చేస్తూ.. సోషల్మీడియా సంస్థలపై ఒకరకమైన నియంత్రృత్వాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీ.. మోర్బీ వంతెన వార్తల ప్రసారంపై అప్రకటిత నిషేధం విధించింది. ఘటన జరగ్గానే.. విషాదానికి సంబంధించిన వార్తలు ప్రసారం కాకుండా ఆదివారం రాత్రంతా సెన్సార్ చేసినట్టు తెలుస్తున్నది. ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో ‘#గుజరాత్’ కీవర్డ్ టైప్ చేసినప్పటికీ, కమ్యూనిటీ నియమాల పేరిట సదరు ప్లాట్ఫామ్లు వార్తలను చూపించకుండా నిరోధించడం దీనికి బలాన్ని చేకూరుస్తున్నది. ట్విట్టర్లో కూడా కొంతవరకూ ఈ సెన్సార్షిప్ కనిపించింది. మరోవైపు, కొందరు ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా ఊగడం వల్లే బ్రిడ్జి కూలిపోయిందని, వాళ్లు ఓ వర్గానికి చెందినవారని పాత వీడియోలను కొందరు సోషల్మీడియాలో పోస్ట్ చేసి మోర్బీ ఘటనను తప్పుదారి పట్టించాలని ప్రయత్నించారు. అయితే, అసలైన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో అంతకుముందు ప్రసారమైన వీడియోలు అబద్ధమని తేలిపోయింది.
అప్పుడు అలా..
బెంగాల్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని దేవుడు ఈ విధంగా సందేశమిచ్చాడు
– 2016 మార్చి 31న కోల్కతాలో ఫ్లెఓవర్ కూలిపోయి 27 మంది మృతిచెందితే ప్రధాని మోదీ స్పందించిన తీరిది.
ఇప్పుడిలా..
నా గుండెల నిండా విషాదం నిండి ఉన్నది. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం
-ఆదివారం గుజరాత్లోని మోర్బీ నగరంలో వంతెన కూలిన దుర్ఘటనపై ప్రధాని మోదీ స్పందించిన విధానమిది.