వివాదాల క్వీన్ కంగనా రనౌత్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొన్నిరోజుల క్రితం భారత్కు 1947లో వచ్చింది స్వతంత్రం కాదని, అది భిక్ష అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీత.. తాజాగా జాతిపిత మహాత్మా గాంధీని టార్గెట్ చేసింది.
భారత స్వతంత్ర నేతలు గాంధీ, నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా వంటి వారంతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ను బ్రిటిష్ పాలకులకు అప్పగిస్తామని ఒప్పందం చేసుకున్నారంటూ వచ్చిన ఒక పాత పేపర్ క్లిప్ను కంగన షేర్ చేసింది. ‘మీరు గాంధీ అభిమానా? లేక నేతాజీ మద్దతుదారా? రెండూ మాత్రం కాలేరు. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి’ అంటూ పోస్టు పెట్టింది.
అలాగే ‘దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని అణిచివేతదారులకు అప్పగించినవారికి అధికార దాహం, కుయుక్తులే తప్ప ధైర్య సాహసాలు ఉండవు’ అంటూ విమర్శలు గుప్పించింది. ఈ వ్యాఖ్యలపై నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ స్పందించారు.
Netaji Daughter on Kangana Controversy | నేతాజీ, గాంధీజీ ఇద్దరూ కూడా భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు పోరాడిన గొప్ప హీరోలని ఆమె అన్నారు. ‘ఒకరిని కాదని మరొకరిని ఎంపిక చేసుకోలేం. భారత స్వాతంత్ర్యం అనేది సంయుక్త పోరాట ఫలితం. స్వాతంత్ర్యం కేవలం అహింసా మార్గం వల్లే రాలేదని, నేతాజీతోపాటు భారత జాతీయ సైన్యం (ఎన్ఐఏ) కూడా కీలక పాత్ర పోషించిందని మనందరికీ తెలుసు’ అని ఆమె వివరించారు.
అలాగే కేవలం నేతాజీ, ఎన్ఐఏ వల్లే స్వాతంత్ర్యం వచ్చిందనడం కూడా సబబు కాదని అనిత అభిప్రాయపడ్డారు. తన తండ్రి సుభాష్ చంద్రబోస్ను నియంత్రించడం కుదరదని మహాత్మా గాంధీ భావించేవారని, అందుకే ఇద్దరి మధ్య కొంత ఇబ్బందికర వాతావరణం ఉండేదని ఆమె గుర్తుచేసుకున్నారు. కానీ గాంధీజీని తన తండ్రి ఎంతగానో ఆరాధించేవారని స్పష్టం చేశారు.