న్యూఢిల్లీ: నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా ఏప్రిల్ 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరప్రదేశ్లోని వారణాసిని సందర్శిస్తారు. అధికార సమాచారం ప్రకారం ఏప్రిల్ 2న ప్రధాని మోదీతో షేర్ బహదూర్ దేవుబా సమావేశమవుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, అభివృద్ధి, ఆర్థిక భాగస్వామ్యం, వ్యాపారం, ఆరోగ్య రంగంలో సహకారం, ఇరు దేశ ప్రజల అనుసంధానం, నేపాల్-భారత్ మధ్య నెలకొన్న సమస్యలపై ఈ సందర్భంగా చర్చించనున్నారు.
కాగా, 2021 జూలైలో నేపాల్ ప్రధాని పదవిని మరోసారి చేపట్టిన షేర్ బహదూర్ దేవుబా అనంతరం భారత్ను సందర్శించడం ఇదే తొలిసారి. అయితే ఆయన గతంలో నాలుగు సార్లు ఆ దేశ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా భారత్లో పర్యటించారు. ఆయన చివరిగా 2017లో భారత్ను సందర్శించారు.
మరోవైపు భారత్, నేపాల్ మధ్య ఒక సంప్రదాయం కొనసాగుతున్నది. ఇందులో భాగంగా ఇరు దేశాల అధినేతలు ఆ మేరకు సందర్శిస్తుంటారు. అలాగే భారత్, నేపాల్ ఆర్మీ జనరల్స్ కూడా ఇరు దేశాల్లో పర్యటిస్తుంటారు. ఈ సందర్భంగా ఆయా దేశాల జనరల్ ర్యాంక్తో వారిని గౌరవిస్తారు.