న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: ఇండియా ఏఐ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అర్ధ నగ్న నిరసన తెలిపిన యువజన కాంగ్రెస్ సభ్యులు నేపాల్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన జెన్జీ ఉద్యమం నుండి ప్రేరణ పొందారని ఢిల్లీ పోలీసులు శుక్రవారం కోర్టుకు తెలిపారు. ప్రపంచ నాయకులు, టెక్ దిగ్గజాలు పాల్గొన్న ఉన్నత స్థాయి సదస్సు సందర్భంగా జరిగిన ఈ ప్రదర్శన వెనుక పెద్ద కుట్రే ఉందని అధికారులు వెల్లడించారు. నిందితులను ముఖాముఖి ప్రశ్నించడంతోపాటు డిజిటల్ ఆధారాలను కూడా సేకరించాల్సి ఉందని, ఇది చాలా ముఖ్యమైన దర్యాప్తు అని తెలిపారు.
యూత్ కాంగ్రెస్ సభ్యుల కస్టడీని కోర్టుకు విన్నవించారు. వారు ధరించిన టీషర్టులపై ముద్రించిన ఖర్చులను ఎవరు భరించారో తెలుసుకోవడంతోపాటు నిరసనకారులకు ఎవరు నిధులు సమకూర్చారో కూడా దర్యాప్తు ద్వారా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల వాదనలను నిరసనకారుల తరఫు న్యాయవాది తోసిపుచ్చారు.
తన కక్షిదారులు శాంతియుతంగా నిరసన తెలిపారని, ఎవరిపైనా దాడి చేయలేదని చెప్పారు. నిజానికి నిరసనకారుల పైనే దౌర్జన్యం జరిగిందని ఆయన వాదించారు. ఇతర పార్టీలకు హెచ్చరికగా ఉండేందుకే నిందితులపై కఠినమైన సెక్షన్లు పోలీసులు నమోదు చేశారని లాయర్ వాదించారు.