న్యూఢిల్లీ: నీట్-యూజీ రీ-ఎగ్జామినేషన్ జూన్ 21న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ప్రకటించారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన సంస్కరణలలో భాగంగా వచ్చే ఏడాది నుంచి వైద్య ప్రవేశ పరీక్ష కంప్యూటర్ ఆధారంగా జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. నీట్ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జూన్ 21న మరోసారి నిర్వహించే నీట్ పరీక్ష వ్యవధిని 15 నిమిషాలపాటు పొడిగించినట్లు ప్రధాన్ చెప్పారు. విద్యార్థులు తమకు నచ్చిన పరీక్షా నగరాలను మళ్లీ ఎంచుకునే అవకాశం ఉంటుందని, వారికి జూన్ 14వ తేదీలోగా అడ్మిట్ కార్డులు అందుతాయని ఆయన తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తుకే మా ప్రథమ ప్రాధాన్యం. సమాజానికి, ముఖ్యంగా విద్యార్థులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నిర్భయంగా పరీక్షలకు హాజరుకావాలి. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఈసారి అవకతవకలు జరగనివ్వం అని విద్యా శాఖ మంత్రి హామీ ఇచ్చారు. క్రితంసారి అవకతవకలు జరిగిన తర్వాత రాధాకృష్ణన్ కమిటీని నియమించామని, దాని సిఫార్సులను అమలు చేశామని ఆయన చెప్పారు. అయినప్పటికీ ఈ ఘటన జరిగిందని, అందుచేత మొదటి చర్యగా పరీక్షను రద్దు చేశామని మంత్రి చెప్పారు. గెస్పేపర్ల అతివ్యాప్తి జరిగిందంటూ ఎన్టీఏ గ్రీవెన్స్ సిస్టమ్ ద్వారా అభ్యంతరాలు అందిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చిందని, దాని ఆధారంగా ప్రాథమిక విచారణ ప్రారంభించామని మంత్రి వివరించారు.
మే 3న పరీక్ష జరిగింది. మే 7వ తేదీ నాటికి గెస్ పేపర్లు అని పిలిచే వాటిలో కనిపించిన కొన్ని ప్రశ్నలు ఈ సంవత్సరం నీట్ యూజీ ప్రశ్నపత్రంలో కూడా ఉన్నాయని పేర్కొంటూ ఎన్టీఏ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా అభ్యంతరాలు అందాయి అని ప్రధాన్ చెప్పారు. వెంటనే చర్చలు జరిపి ఎన్టీఏ, ప్రభుత్వం, ఉన్నత విద్యా శాఖ సంయుక్తంగా ప్రాథమిక విచారణను చేపట్టాయని, తర్వాత దర్యాప్తు సంస్థలకు అప్పగించినట్టు వివరించారు.