NEET UG Registration | దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ) పరీక్ష దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పొడిగించింది. ప్రస్తుత గడువు శనివారం రాత్రితో ముగిసింది. తాజాగా ఈ నెల 16 వరకు గడువును పొడిగిస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకున్నది. నీట్ ఎగ్జామ్ మే 5న దేశవ్యాప్తంగా జరుగనున్నది. ఈ పరీక్ష ఆంగ్లం, హిందీ, తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా.. నీట్ పరీక్షకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి.
శనివారం నాటికి 25లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకోవడం ఇదే తొలిసారి. గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది 4.2 లక్షలకుపైగా దరఖాస్తులు అధికంగా వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. గడువు పొడిగించడంతో మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, 1.09లక్షల ఎంబీబీఎస్ సీట్లు, 26వేల డెంటల్ సీట్లు.. యునాని, హోమియోపతి, వెటర్నరీ, ఆయుర్వేదం, నర్సింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న సుమారు 2లక్షల సీట్ల కోసం 13లక్షలకుపైగా మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తున్నది.