Neet-2021 | దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్ నీట్-2021ను వాయిదా వేయాలని దాఖలైన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నెల 12న అంటే వచ్చే ఆదివారం నీట్ యూజీ-2021 యధాతథంగా జరుగుతుందని స్పష్టం చేసింది. సీబీఎస్ఈ కంపార్ట్మెంట్, ప్రైవేట్, పత్రచార్ పరీక్షల ఫలితాల వెల్లడి తర్వాత నీట్ యూజీ-2021 రీషెడ్యూల్ చేయాలని కొందరు విద్యార్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై సోమవారం జస్టిస్లు ఏఎం ఖాన్విల్కర్, రుషికేశ్ రాయ్, సీటీ రవికుమార్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఒకే రోజు పలు పరీక్షలు ఉన్నాయన్న విద్యార్థుల వాదనను తోసిపుచ్చింది. ఒకే రోజు పలు పరీక్షలు ఉంటే ప్రాధాన్యాలు ఖరారు చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది.
దేశవ్యాప్తంగా 16 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారని గుర్తు చేసింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12న నీట్ యూజీ-2021 యధాతథంగా జరుగుతుందని స్పష్టం చేసింది. కొద్ది మంది విద్యార్థుల కోసం నీట్ పరీక్షను వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది. కొద్ది మంది కోసం అత్యధిక విద్యార్థులను ఇబ్బందుల పాల్జేయబోమని పేర్కొన్నది.