న్యూఢిల్లీ, ఆగస్టు 29: పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ పీజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి కౌన్సెలింగ్లో కొత్త సీట్ల చేర్పు ప్రక్రియను నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) పూర్తి చేసేందుకుగానూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం పేర్కొన్నది. సెప్టెంబర్ 15 నాటికి ఎన్ఎంసీ కొత్త లెటర్ ఆఫ్ పర్మిషన్స్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది.
కౌన్సెలింగ్ వాయిదా వేసిన ఆరోగ్యశాఖ కొత్త షెడ్యూల్పై స్పష్టత ఇవ్వలేదు. అయితే మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని సంబంధిత అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముందు షెడ్యూల్ ప్రకారం నీట్ పీజీ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నది. కౌన్సెలింగ్లో మరిన్ని సీట్లను చేర్చడం ద్వారా అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని ఆరోగ్యశాఖ పేర్కొన్నది. మరోవైపు కొన్ని వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ సోదాలు కూడా కొనసాగుతున్నాయి.