NEET PG 2024 | సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏడు విడుతల్లో లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఎన్నికల నేపథ్యంలో నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET PG 2024) పరీక్షల షెడ్యూల్ను సవరించింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీతో నేషనల్ మెడికల్ కమిషన్, డైరెక్టరేట్ జనరల్ ఫర్ హెల్త్ సైన్సెస్, నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన సమావేశంలో పరీక్షల షెడ్యూల్పై నిర్ణయం తీసుకున్నారు. కమిషన్ ఇప్పుడు నీట్ పీజీ 2024 పరీక్షను జూన్ 23న నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఏప్రిల్ 19 నుంచి జూన్ ఒకటి వరకు ఏడు దశల్లో సాధారణ ఎన్నికలను నిర్వహించి, జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతామని ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. సవరించిన షెడ్యూల్ ప్రకారం, నీట్పీజీ ఫలితాలు జూలై 15న ప్రకటించనున్నారు. అడ్మిషన్ల కోసం ఆగస్టు 5 నుంచి 15 మధ్య కౌన్సెలింగ్ జరుగుతుంది. కటాఫ్ తేదీ ఆగస్టు 15న ముగుస్తుంది. కొత్త సంవత్సరం అకడమిక్ సెషన్ సెప్టెంబర్ 16న ప్రారంభమవుతుంది. విద్యార్థులు కళాశాల్లో చేరేందుకు అక్టోబర్ 21 వరకు అవకాశం ఉంటుంది. నీట్ పీజీ ఇంతకు ముందు జూలై 7న నిర్వహించాలని నిర్ణయించారు. అంతకు ముందు మార్చి 3న నిర్వహించనున్నట్లు గతంలోనే ప్రకటించి ఆ తర్వాత షెడ్యూల్ను సవరించింది. తాజాగా మరోసారి షెడ్యూల్ను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నది.