NEET Exam 2026 : దేశవ్యాప్తంగా మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ – 2026 (NEET UG – 2026) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం రెండ గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 552 నగరాలు, 14 అంతర్జాతీయ కేంద్రాల్లో కలిపి సుమారు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు.
పరీక్ష నిర్వహణ కోసం ఎన్టీఏ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. విద్యార్థులను ఉదయం 11 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గేట్లు మూసివేసి ఆ తర్వాత వచ్చిన వారిని లోపలికి అనుమతించలేదు. పరీక్ష కేంద్రాల వద్ద డ్రెస్ కోడ్తోపాటు ఇతర నిబంధనలను కఠినంగా అమలు చేశారు. అడ్మిట్ కార్డు, ఫొటో, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉన్నవారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించారు.
విద్యార్థులకు 1.45 గంటలకు ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు అందజేసి, రెండు గంటలకు పరీక్ష ప్రారంభించారు. పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.