చెన్నై: ఆదివారం జరిగిన నీట్ (NEET) పరీక్ష సందర్భంగా ఒక వివాదం వెలుగుచూసింది. పరీక్ష రాసేందుకు వచ్చిన మహిళలతో బలవంతంగా లోదుస్తులు తొలగించినట్లు ఒక మహిళా జర్నలిస్ట్ ఆరోపించింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని ఒక పరీక్షా కేంద్రం వద్ద ఈ సంఘటన జరిగినట్లు ఆమె పేర్కొంది. నీట్ పరీక్షకు హాజరైన మహిళలు బ్రా ధరించ కూడదని చెప్పారని, ధరించి వచ్చిన కొందరితో బలవంతంగా వాటిని విప్పించారని ఆ మహిళా జర్నలిస్ట్ ఆరోపించారు. దీని గురించి చాలా సిగ్గుతో బాధపడిన ఒక యువతితో తాను మాట్లాడటంతో తనకు ఈ విషయం తెలిసిందని ట్విట్టర్లో ఆమె పేర్కొన్నారు. అయితే దీనిపై కొందరు ఆ మహిళా జర్నలిస్ట్ను ఎగతాళి చేయడంతోపాటు విమర్శించారు. దీంతో ఆమె వారికి ఘాటుగా సమాధానమిచ్చారు. ‘నన్ను అసభ్యకరమైన ప్రశ్నలు అడిగే వారు, బ్రా ధరించడానికి అనుమతి ఉందా లేదా? అని పరీక్ష బోర్డుని అడగాలి’ అని ట్వీట్ చేశారు.
కాగా, తమిళనాడు విద్యా మంత్రి అన్బిల్ మహేష్ ఈ ఆరోపణపై స్పందించారు. ఇలాంటి వాటిని సీఎం స్టాలిన్ తొలి నుంచి ఖండిస్తున్నారని అన్నారు. పరీక్షల సందర్భంగా ఇన్విజిలేటర్ల తీరును ఆయన తప్పుపట్టారు. మరోవైపు ఆ రాష్ట్ర బీజేపీ ప్రతినిధి నారాయణన్ తిరుపతి కూడా దీని గురించి మాట్లాడారు. నిబంధనల ఉల్లంఘన జరిగితే ఖండించాలని, బాధ్యులను శిక్షించాలని అన్నారు. అయితే విద్యార్థులు నిబంధనలకు లోబడే ఇష్టపూర్వకంగా పరీక్షా కేంద్రాలకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నీట్ పరీక్ష లేదా నిర్వహించే సంస్థకు ఇలాంటి సమస్యలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
కాగా, విద్యార్థుల ఉసురు తీస్తున్న నీట్ను రద్దు చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తొలి నుంచి డిమాండ్ చేస్తున్నారు. నీట్ రద్దు కోసం అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు.