NEET Results | ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్-యూజీ 2023 పరీక్షలో ఇద్దరు విద్యార్థులు తొలి ర్యాంక్ సాధించారు. తమిళనాడుకు చెందిన ప్రబంజన్ జే, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బొరా వరుణ్ చక్రవర్తి 99.99 పర్సంటైల్ స్కోర్తో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. తెలంగాణలో కాంచనీ గేయంత్ రఘురామ్ రెడ్డికి అఖిల భారత స్థాయిలో 15వ ర్యాంక్, జాగృతి బొడెద్దులుకు 49వ ర్యాంక్ లభించింది. తెలంగాణలో 42,654 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏపీ విద్యార్థి బొరా వరుణ్ చక్రవర్తి.. ఓబీసీ క్యాటగిరీలోనూ ఫస్ట్ ర్యాంక్ పొందారు. ఈడబ్ల్యూసీ విభాగంలోనూ ఏపీ విద్యార్థి ప్రవధాన్ రెడ్డి తొలి ర్యాంక్ సాధించారు. ఎస్సీ క్యాటగిరీలో కే యశశ్రీ రెండో ర్యాంకు నిలిచారు. కాగా, ఏపీలో 42,836 మంది విద్యార్థులు అర్హత పొందారు.
మొత్తం 20.38 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 11.45,968 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఉత్తరప్రదేశ్ విద్యార్థులు అత్యధికంగా 1.39 లక్షల మంది అర్హత సాధించగా, తర్వాతీ జాబితాలో మహారాష్ట్ర 1.31 లక్షలు, రాజస్థాన్ లక్ష దాటారు. దేశంలోనే అత్యంత జనాభా గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర కాగా, రాజస్థాన్ కూడా టాప్-10లో నిలిచింది. గత నెల ఏడో తేదీన విదేశాల్లో 14 నగరాలతోపాటు దేశీయంగా 499 నగరాల్లోని 4097 కేంద్రాల్లో నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-యూజీ) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. ఏడుగురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడ్డారని ఎన్టీఏ అధికారులు తెలిపారు.
అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లో నీట్-యూజీ పరీక్ష నిర్వహించారు. భారత్ ఆవల అబుదాబ, బ్యాంకాక్, కొలంబో, దోహ, ఖాట్మండు, కౌలాలంపూర్, లాగోస్, మనామా, మస్కట్, రియా్, షార్జా, సింగపూర్, దుబాయ్, కువైట్ సిటీల్లో నీట్ పరీక్ష నిర్వహించారు.
విద్యార్థులకు వచ్చిన మార్కులను బట్టి వారికి ఎన్టీఏ.. ఆల్ ఇండియా ర్యాంకులు ఇస్తుంది. ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నీట్ మెరిట్ ప్రాతిపదికన యూనివర్సిటీలు సీట్లు కేటాయిస్తాయి. ఆల్ ఇండియా ర్యాంకును బట్టి, విద్యార్థులు తమ రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్రాల్లోనూ విద్యార్థుల మెరిట్ లిస్ట్ ప్రకారం ఆరోగ్య విశ్వవిద్యాలయాలు కౌన్సిలింగ్ ద్వారా సీట్లు కేటాయిస్తాయని ఎన్టీఏ అధికారులు తెలిపారు. రాష్ట్రాల స్థాయిలో మెడికల్ కోర్సుల కౌన్సెలింగ్ లో తమ పాత్రమే ఉండదని ఎన్టీఏ అధికారులు చెప్పారు.