న్యూఢిల్లీ, అక్టోబర్ 10: కరోనా సమూల కట్టడికి మూడో డోసు (బూస్టర్ డోసు) ఇవ్వాలన్న వాదన దేశంలో క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోని ప్రముఖ వైద్యులందరూ బూస్టర్ డోసు వేసుకున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో బూస్టర్ డోసు సాధ్యమా?
వైద్యులకు బూస్టర్ డోసు ఇస్తున్నారా?
దేశంలో బూస్టర్ డోసు ఇవ్వడంపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ, తరుచూ వైరస్ బారిన పడుతున్నారు. దీంతో వారిలో యాంటిబాడీల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. ఈ క్రమంలోనే ప్రధాన నగరాల్లోని కొందరు వైద్యులు ‘బూస్టర్ డోసు’ తీసుకున్నట్టు సమాచారం.
డోసుల సంఖ్యలో తేడా రాలేదా?
వ్యాక్సిన్ వయల్స్లో ‘స్పిల్లింగ్ డోస్’ పేరిట కొన్ని టీకా సీసాలను అదనంగా చేరుస్తారు. వ్యాక్సిన్ వృథా అయిన సందర్భాల్లోనే వీటిని వినియోగిస్తారు. ఇవి అధికారిక లెక్కల్లోకి రావు. ప్రస్తుతం వైద్యులు ఈ అదనపు సీసాల్లోని ‘స్పిల్లింగ్ డోస్’లనే బూస్టర్ డోసులుగా వేసుకున్నట్టు తెలుస్తున్నది.
బూస్టర్ డోసు సాధ్యమా?
పేద దేశాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ధనిక దేశాలు మరికొన్ని నెలలపాటు బూస్టర్ డోసుకు దూరంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో) విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్, ఐరోపా వంటి దేశాలు బూస్టర్ డోసు పంపిణీని ఇప్పటికే మొదలు పెట్టాయి. దేశంలో ఇప్పటివరకూ 95 కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు కేంద్రప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇంకా 70 శాతం మంది ప్రజలకు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ (రెండు డోసుల టీకాలు) జరుగలేదని స్వచ్ఛంద నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రజలకు ఇప్పటికిప్పుడు బూస్టర్ డోసు ఇవ్వడం జరుగకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కరోనాతో పిల్లల్లో కోపం, నిరాశ
న్యూఢిల్లీ: కొవిడ్ సంక్షోభం కారణంగా ఏడాదిన్నర కాలంగా ఇండ్లకే పరిమితమైన పిల్లల్లో మానసిక సమస్యలను గుర్తించినట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్ పాఠాలకు అలవాటుపడిపోయిన చిన్నారులు.. పాఠశాలలు తెరిచాక.. తోటి విద్యార్థులు, టీచర్లతో ముందులా కలివిడిగా ఉండకపోవడాన్ని గమనించినట్టు పేర్కొన్నారు. ఇది కొందరిలో కోపం, నిరాశకు దారితీస్తున్నట్టు కోర్స్టోన్ ఎన్జీవో ప్రొఫెసర్ గ్రాసీ ఆండ్రూ తెలిపారు. ఆదివారం ప్రపంచ మానసిన ఆరోగ్య దినం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.