న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: నీట్-పీజీ పరీక్షను మే 21న నిర్వహించనున్నట్టు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్(ఎన్బీఈఎంఎస్) శుక్రవారం ప్రకటించింది. మే 21న ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపింది. మార్చి 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది. నీట్-పీజీ పరీక్షను తొలుత మార్చి 12 నిర్వహించాలని భావించారు. ఇందుకోసం నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అయితే ఈ షెడ్యూల్ నీట్-పీజీ-2021 కౌన్సెలింగ్ అడ్డు వస్తుండటంతో పరీక్ష తేదీలను మార్చాలని, 6-8 వారాల పాటు వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం గురువారం ఎన్బీఈఎంఎస్కు లేఖ రాసింది. ఎంబీబీఎస్ విద్యార్థుల ఇంటర్న్షిప్లు పూర్తికాని అంశాన్ని కూడా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో పరీక్ష తేదీలను మార్చుతూ ఎన్బీఈఎంఎస్ ప్రకటన విడుదల చేసింది. పరీక్ష షెడ్యూల్ను మార్చింది. నీట్-పీజీ ఎంట్రన్స్ తొలి నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ ఎంబీబీఎస్ విద్యార్థులు గత నెల 25న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే పరీక్షలను వాయిదా వేయాలని కేంద్రం కోరింది.
7న సీఐఎస్సీఈ పరీక్ష ఫలితాలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ది కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (సీఐఎస్సీఈ) మొదటి దశ బోర్డు పరీక్షల ఫలితాలు ఈ నెల 7న విడుదల కానున్నాయి. పదో తరగతి (ఐసీఎస్ఈ), 12వ తరగతి (ఐఎస్సీ) మొదటి సెమిస్టర్ ఫలితాలను సోమవారం విడుదల చేస్తామని బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గెర్రీ అరథూన్ శుక్రవారం వెల్లడించారు. ఐసీఎస్ఈ పరీక్షలను గతేడాది నవంబర్ 29 నుంచి డిసెంబర్ 16 వరకు, ఐఎస్ఈ పరీక్షలను నవంబర్ 22 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించారు.