Indian Railways | భారతీయ రైల్వే (Indian Railways) లోని రైళ్ల ఏసీ కోచ్లలో ప్రయాణికులకు అందించే బెడ్రోల్ సామగ్రి భారీ స్థాయిలో చోరీకి గురవుతోంది. కొవిడ్ అనంతరం 2022 జనవరి నుంచి 2026 మే వరకు నాలుగేళ్లలో దేశవ్యాప్తంగా టవళ్లు (Towels), దిండ్లు, దుప్పట్లు (Bedsheets) వంటి కనీసం 1.27 కోట్ల వస్తువులు మాయమైనట్లు ఆర్టీఐ (RTI) ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తుకు 69 రైల్వే డివిజన్లలో 54 డివిజన్లు స్పందించగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రజా ఆస్తులపట్ల నిర్లక్ష్య ధోరణిని ఇది ప్రతిబింబిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
ఆర్టీఐ వివరాల ప్రకారం.. గడిచిన నాలుగేళ్లలో టవల్లు, దిండ్లు, దుప్పట్ల వంటి వస్తువుల చోరీ కారణంగా బెడ్రోల్ కాంట్రాక్టర్లకు సుమారు రూ.104.51 కోట్ల నష్టం వాటిల్లింది. 2022తో పోలిస్తే 2025 నాటికి ఇలాంటి దొంగతనాలు 56 శాతం పెరిగినట్లు వెల్లడైంది. ఈ సమస్యను రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారని, దొంగతనాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ప్రయాణికులు అత్యధికంగా చోరీ చేసిన వస్తువుల్లో ఫేస్ టవల్ మొదటి స్థానంలో నిలిచింది. నాలుగేళ్లలో 46.54 లక్షల ఫేస్ టవల్స్ మాయమయ్యాయి.
వాటి తర్వాత 41.13 లక్షల బెడ్షీట్లు, 23.59 లక్షల పిల్లో కవర్లు, 12.95 లక్షల దుప్పట్లు చోరీకి గురయ్యాయి. మరోవైపు బ్యాగులో సులభంగా పెట్టుకోలేని కారణంగా దిండ్లు అత్యల్పంగా చోరీకి గురయ్యాయి. రైల్వే డివిజన్ల వారీగా చూస్తే బికనెర్ డివిజన్లో అత్యధికంగా 25.76 లక్షల వస్తువులు చోరీకి గురయ్యాయి. తర్వాత రాంచీ (9.31 లక్షలు), ఢిల్లీ (8.21 లక్షలు), ముంబై (8.17 లక్షలు), జోధ్పూర్ (8.09 లక్షలు), అహ్మదాబాద్ (6.94 లక్షలు) డివిజన్లు ఉన్నాయి. పంపిణీ బాధ్యత నిర్వహించే ఏజెన్సీలే ఈ వస్తువుల లెక్కలు చూసుకోవాల్సి ఉంటుందని, కొరత ఏర్పడితే ఆర్థిక భారం కూడా వారిపైనే పడుతుందని రైల్వే ప్రతినిధి తెలిపారు.