NDA meet : లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ దక్కడంతో ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో రేపు సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూటమి పార్టీల అధినేతలందరికీ సమాచారం ఇచ్చారు.
ఈసారి ఎన్డీఏ కూటమికి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. దాంతో ప్రభుత్వం స్థిరంగా కొనసాగాలంటే భాగస్వామ్య పక్షాల మద్దతు కీలకంగా మారింది. ముఖ్యంగా నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమిలో కీలకపాత్ర పోషించనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ 16 స్థానాల్లో, జేడీయూ 14 స్థానాల్లో విజయం సాధించాయి.
అదేవిధంగా కూటమిలోని ఏక్నాథ్ షిండే వర్గం శివసేన పార్టీకి ఆరు స్థానాలు, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్జన శక్తి పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించాయి. దాంతో ఈ రెండు పార్టీలు కూడా ఇప్పుడు ఎన్డీఏకు కీలకంగా మారాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కూటమి సమావేశం గురించి చర్చించినట్లు తెలుస్తున్నది.
ఇదిలావుంటే ఇప్పటికే జేపీ నడ్డా నివాసంలో బీజేపీ సమావేశం జరుగుతున్నది. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ కూడా రాత్రి ఏడు గంటలకల్లా ఢిల్లీలోని బీజేపీ హెడ్క్వార్టర్స్కు చేరుకునే అవకాశం ఉంది.