ముంబై : ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కార్పై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఠాక్రే సారథ్యంలోని ఎంవీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నెలకు వంద కోట్లు వసూలు చేయాలని పోలీస్ అధికారి సచిన్ వజేను మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ కోరారని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంవీర్ సింగ్ చేసిన ఆరోపణలను ఫైర్బ్రాండ్ నటి ప్రస్తావించారు.
మహారాష్ట్ర సర్కార్లో పేరుకుపోయిన అవినీతి, అసమర్ధ పాలనను తాను లేవనెత్తగా ప్రతిగా తనపై ఆరోపణలు, బెదిరింపులు, విమర్శలు గుప్పించారని అన్నారు. ముంబై పట్ల తన విశ్వాసాన్ని ప్రశ్నిస్తే తాను మౌనంగా రోదించానని కంగనా చెప్పుకొచ్చారు. తన ఇంటిని అక్రమంగా కూలగొడితే చాలా మంది వేడుక చేసుకున్నారని కంగనా వ్యాఖ్యానించారు. సేన సర్కార్ అవినీతిపై గతంలో తాను చెప్పినవన్నీ ఇప్పుడు వాస్తవాలుగా వెలుగుచూస్తున్నాయని అన్నారు. ఎంవీఏ సర్కార్ నిర్వాకాలు ఇంకా బయటపడతాయని అన్నారు. తాను నిజమైన దేశభక్తురాలినని చెబుతూ ‘మహావసూలీఅఘడి సర్కార్’ అని సెటైర్లు గుప్పించారు.