ముంబై : బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసుకు సంబంధించి ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), బీజేపీలు లాలూచీ పడ్డాయని ఆరోపించారు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్కు దారితీసిన క్రూయిజ్ డ్రగ్స్ దందా ఓ తప్పుడు కేసులా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పబ్లిసిటీ కోసం ఎన్సీబీ, బీజేపీలు ఈ డ్రగ్ కేసును రక్తికట్టించాయని నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఆర్యన్ ఖాన్ కేసులో ఎన్సీబీ విడుదల చేసిన ఫోటోలు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే కార్యాలయంలో తీసినవని అన్నారు.
ఇవి ఘటనా స్ధలంలో తీసిన ఫోటోలు కాదని, క్రూయిజ్లో ఎలాంటి డ్రగ్స్నూ సీజ్ చేయలేదని దీన్నిబట్టి తేటతెల్లమవుతున్నదని మాలిక్ పేర్కొన్నారు. ప్రచారం కోసం ముందుకుతెచ్చిన బూటకపు కేసులా ఇది కనిపిస్తోందని దుయ్యబట్టారు. ఆర్యన్ ఖాన్తో కనిపించిన ఓ వ్యక్తి ఫోటో వైరల్గా మారగా ఆయన ఎన్సీబీ అధికారి అని అందరూ అనుకోగా అతడికి ఎన్సీబీతో సంబంధం లేదని అధికారులు ప్రకటించారు. ఈ ఫోటోలో కనిపించిన వ్యక్తి బీజేపీ కార్యకర్తని నవాబ్ మాలిక్ ఆరోపించారు. మరో వీడియోలో ఎన్సీబీ కార్యాలయంలో ఆర్యన్తో కనిపించిన మనీష్ భనుషాలి అనే వ్యక్తి కూడా బీజేపీ సభ్యుడేనని అన్నారు.