ముంబై : రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు శరద్ పవార్ ఆసక్తిగా లేరని ఎన్సీపీ సీనియర్ నేత తెలిపారు. ఎన్నికల్లో పవార్కు మద్దతు ఇచ్చేందుకు పలు పార్టీలు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్సీపీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముంబైలో మహారాష్ట్ర ఎన్సీపీ మంత్రులతో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఈ అంశం సైతం చర్చకు వచ్చింది. ఈ సమావేశానికి హాజరైన ఓ మంత్రి మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ ఆదివారం పవార్ను కలిశారని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్సీపీ చీఫ్కు తమ పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పారు.
ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే సైతం ప్రతిపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా పవార్ను ప్రతిపాదించారు. పవార్ అభ్యర్థిత్వంపై మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీని)ను కూడా కాంగ్రెస్ సంప్రదించిందని ఖర్గే చెప్పారు. అయితే, ఆయన దానిపై (ఎన్నికల్లో పోటీ) ఆసక్తిగా ఉన్నాడని తాను అనుకోనన్నారు. పవార్ ప్రజలను కలిసేందుకు ఇష్టపడే ప్రజల మనిషి అని, రాష్ట్రపతి భవన్కు పరిమితంకారన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే పనిలో పవార్ బిజీగా ఉన్నారని ఖర్గే పేర్కొన్నారు.