పార్టీ విస్తరణ కోసం విపరీతంగా కష్టపడి, ఏదో ఒకనాడు ప్రధాని పీఠంపై అధ్యక్షుడు శరద్ పవార్ని కూర్చోబెడదామని ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రతినబూనారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ 81వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్సీపీ ఎంపీ అమోల్ ఖోలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 26 పార్లమెంట్ స్థానాలున్న గుజరాత్ నుంచి మోదీ ప్రధాని పీఠాన్ని అధిరోహించారని, మరి 48 ఎంపీ స్థానాలున్న మహారాష్ట్ర నుంచి పవార్ ఎందుకు ప్రధాని పీఠాన్ని అధిరోహించవద్దని ప్రశ్నించారు.
ప్రధాని పీఠాన్ని అధిరోహించడానికి పవార్కు అన్ని అర్హతలూ ఉన్నాయని ఎంపీ స్పష్టం చేశారు. యూపీ తర్వాత మహారాష్ట్రలోనే ఎక్కువ ఎంపీ సీట్లున్నాయని, అయినా మహారాష్ట్ర నుంచి ఒక్కరు కూడా ప్రధాని కాలేకపోయారని ఆయన అన్నారు. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రజలు, నేతలు ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన కోరారు. శరద్ పవార్కు ప్రస్తుతం 81 సంవత్సరాలున్నాయని, అయినా నిత్యం ఏదో రకంగా ప్రజలతో మమేకమవుతూనే ఉన్నారని ఎన్సీపీ అభిప్రాయపడింది. నిత్యం కష్టపడి పనిచేసే స్వభావమున్న పవార్ను ఏదో ఒకరోజు ప్రధానిని చేసి తీరుతామని ఎన్సీపీ నేతలు ప్రకటించడం విశేషం.