ముంబై: మరాఠీ సినిమా ప్రదర్శనను నిలిపివేసినందుకు మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ను థానే పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వర్తక్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ మాజీ ఎంపీ ఆనంద్తోపాటు ఆ పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, శరద్ పవార్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జితేంద్ర అవద్, సోమవారం రాత్రి తన అనుచరులతో కలిసి థానేలోని మల్టిప్లెక్స్కు వెళ్లారు. ‘హర హర మహాదేవ్’ సినిమా ప్రదర్శనను అడ్డుకుని నిలిపివేశారు. సినిమా చూసేందుకు వచ్చిన కొందరిపై దాడి చేశారు. ఛత్రపతి శివాజీ చరిత్రను ఈ సినిమాలో వక్రీకరించారని ఆయన ఆరోపించారు.
మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సంఘటనపై మంగళవారం స్పందించారు. సినీ ప్రేక్షకులపై దాడి చేయడాన్ని సహించబోమని అన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ సినిమా తాను చూడలేదని, ఆ వివాదం గురించి తనకు తెలియని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన తెలియజేయాలని అన్నారు.