శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆస్తుల జప్తు వ్యవహారంపై ప్రధాని మోదీతో తాను చర్చించానని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు. ఎంపీ సంజయ్ రౌత్ ఆస్తులను జప్తు చేసే పద్ధతి ప్రజాస్వామ్యయుతంగా లేదని పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ కేంద్ర దర్యాప్తు సంస్థ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటే.. దీనికి కేంద్రమే బాధ్యత తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్లే రౌత్ ఆస్తులను జప్తు చేశారా? అని పవార్ సూటిగా ప్రశ్నించారు.
‘సంజయ్ రౌత్ ఆస్తుల జప్తు వ్యవహారంపై ప్రధాని మోదీతో మాట్లాడాను. ఈడీ ఆస్తుల జప్తు చేసిన విధానం ప్రజాస్వామికంగా లేదని మోదీతో చెప్పాను. రౌత్ కేవలం రాజ్యసభ సభ్యుడు మాత్రమే కారని, ఆయనో జర్నలిస్ట్ అన్న విషయాన్ని కూడా మోదీ దృష్టికి తీసుకెళ్లాను. అసలు ఏ ప్రాతిపదికన ఆయనపై ఈడీ చర్యలు తీసుకుంది? ఇది పూర్తిగా అప్రజాస్వామికం.’ అని పవార్ వెల్లడించారు.
మహావికాస్ అగాఢీ ప్రభుత్వం గురించి తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని, అయితే.. ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కకు పెట్టినట్లు కేంద్ర వ్యవహారం ఉండకూడదని పవార్ స్పష్టం చేశారు. పూర్తి కాలం మహావికాస్ అగాఢీ అధికారంలో వుంటుందని పవార్ స్పష్టం చేశారు. మళ్లీ కూడా మహా వికాస్ అగాఢీయే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనకు యూపీఏ చైర్మన్ బాధ్యతలు స్వీకరించే ఉద్దేశం లేదని పవార్ మరోసారి పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలు మార్లు ప్రకటించానని, తనకు అలాంటి ఆలోచనలు లేవని పవార్ స్పష్టం చేశారు.