ముంబై, మే 14: కర్ణాటకలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో మహారాష్ట్ర మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ) కూటమి నేతలు ఆదివారం ముంబైలోని ఎన్సీపీ అధినేత శరద్పవార్ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి శివసేన (యూబీటీ) నేతలు ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్రౌత్, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానాపటోలే, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్, బాలాసాహెబ్ తోరట్ తదితర ముఖ్యనేతలు హాజరయ్యారు. కర్ణాటకలో బీజేపీకి ప్రజలు గట్టి షాక్ ఇచ్చారని, మహారాష్ట్రలో కూడా ఆ పార్టీని అదే దెబ్బ కొట్టేలా ఎన్నికల వ్యూహాలు రచించాలని నిర్ణయం తీసుకొన్నారు. కూటమి ఐక్యత బలోపేతం, వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు ఈ భేటీలో చర్చించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సమావేశం తర్వాత శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఎంవీఏ కూటమిలో ఎలాంటి అంతర్గత విబేధాలు లేవన్నారు. కర్ణాటకలో బీజేపీ ’40 శాతం కమీషన్’ ప్రభుత్వాన్ని నడిపితే.. మహారాష్ట్రలో 100 శాతం అవినీతి ఉన్నదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.