మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా పారాయణ అంశం తీవ్ర చర్చను లేవదీస్తోంది. ఇప్పటికే శివసేన బీజేపీపై మండిపడుతుండగా, బీజేపీ శివసేనపై రివర్స్ అటాక్ చేస్తోంది. ఈ సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఘాటుగా స్పందించారు. మహారాష్ట్రలో చాలా చెత్త సమయం నడుస్తోందని, అధమాధమ దశ సాగుతోందని మండిపడ్డారు. ప్రస్తుత పరిణామాలపై తానెంతో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలో గొప్ప సంస్కృతి ఉందని, ఇప్పుడు ఆ సంస్కృతిని కోల్పోయిందని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రది గొప్ప సంస్కృతి. ఇప్పుడు ఆ సంస్కృతిని కోల్పోయింది. ప్రస్తుతం అధమాధమ దశ నడుస్తోంది. ముఖ్యమంత్రి పదవి అత్యున్నత పదవి అని, దానిని కించపరుస్తున్నారని ఫైర్ అయ్యారు.
ప్రతి వ్యక్తికి కూడా మతంతో కొంత భావోద్వేగ సంబంధం ఉంటుందని, దానిని వారి వారి మనస్సుల్లో, ఇళ్లల్లో ఉంచుకోవాలని కోరారు. ఈ భావాలను బయటికి తీసుకొచ్చి, బహిరంగంగా మతపరమైన వ్యాఖ్యలు చేస్తే, వివిధ మతాల మధ్య కలహాలు రావడం తథ్యమని, సమాజంలో ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. ఇలాంటి ఘటనలు మహారాష్ట్రలో ఎప్పుడూ జరగలేదని పవార్ గుర్తు చేసుకున్నారు.