(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): మొఘలుల చరిత్ర, గాంధీ హత్య లాంటి తదితర విషయాలను పాఠ్యపుస్తకాల్లోంచి తొలగించిన ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) ఇప్పుడు తాజాగా విద్యార్థులకు భారాన్ని తగ్గించాలన్న సాకుతో సైన్స్ పాఠాలనూ తొలగించింది. పదో తరగతి సిలబస్లో డార్విన్ ప్రతిపాదించిన జీవ శాస్త్ర పరిణామ క్రమం, మూలకాల ఆవర్తన పట్టిక, శక్తి వనరులు, పర్యావరణ స్థిరత్వం లాంటి క్లిష్టమైన శాస్త్రీయ అంశాలను తొలగించింది.
ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యానికి ఉన్న సవాళ్ళు, రాజకీయ పార్టీలపై ఉన్న అధ్యాయాలనూ తొలగించింది. దీనివల్ల 11-18 ఏండ్ల వయస్సున్న 13.4 కోట్ల విద్యార్థులు ప్రభావితమవుతారని (నష్టపోతారని) ఆయా సబ్జెక్టుల నిపుణులు మండిపడుతున్నారు. ఎన్సీఈఆర్టీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పు పడుతూ, ఆయా పాఠ్యాంశాలను పునరుద్ధరించాలని 4500 మంది శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, సైన్స్ కమ్యూనికేటర్స్ కోరుతున్నారు. ఈ మేరకు కోల్కతాలోని బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు.