Encounter | మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో శనివారం ఉదయం 10 గంటల నుంచి ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఓ మావోయిస్ట్ను హతమార్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. భమ్రాగఢ్ తాలూకాలోని కియార్కోటి-అబుజ్మద్ అడవుల్లో కాల్పులు కొనసాగుతున్నాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతం దట్టమైన అటవీప్రాంతం కాబట్టి ఎప్పటికప్పుడు వివరాలు అందడం లేదని, ప్రస్తుతం ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లుగా సమాచారం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇంటెలిజెన్స్ నుంచి అందిన పక్కా సమాచారం మేరకు గడ్చిరోలి పోలీసు యాంటీ నక్సల్ స్క్వాడ్ సీ60 శనివారం ఉదయం ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అబుజ్మద్ అడవుల్లో ఆపరేషన్ ప్రారంభించింది. ఈ క్రమంలోనే బలగాలను గమనించిన మావోయిస్టలు కాల్పులు జరిపారు. బలగాలు సైతం స్పందించి ఎదురుకాల్పులు జరుపడంతో ఒకరు మృతి చెందారు. మరికొంత మంది మావోయిస్టులు చనిపోయి ఉండవచ్చని పేర్కొంటున్నారు.