ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కుమారుడు, ఆర్యన్ ఖాన్ డ్రగ్స్-క్రూయిజ్ కేసు నుంచి సమీర్ వాంఖడేను తొలగించడంపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ స్పందించారు. ‘ఇది ఆరంభం మాత్రమే’ అని ట్వీట్ చేశారు. ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలో దర్యాప్తు జరుగుతున్నఆర్యన్ ఖాన్ కేసుతోపాటు నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ కేసు, మరో నాలుగు ఇతర కేసుల దర్యాప్తును ఎన్సీబీ కేంద్ర బృందానికి శుక్రవారం అప్పగించారు.
ఈ నేపథ్యంలో సమీర్ వాంఖడేపై పలు అవినీతి ఆరోపణలు చేసిన మంత్రి నవాబ్ మాలిక్ దీనిపై స్పందించారు. జరుగాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. ‘మొత్తం 26 కేసుల్లో విచారణ జరగాల్సి ఉంది. ఇది ప్రారంభం మాత్రమే. ఈ వ్యవస్థను శుభ్రం చేయడానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది. మేము దానిని చేస్తాము’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.